ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఘోర పరాజయం ఎదురైంది. ఆ పార్టీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది.. ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్‌సీపీ నుంచి ముఖ్య నేతలు ఒక్కొక్కొరుగా బయటకు వెళ్లిపోయారు. ఇలాంటి సమయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ పార్టీలో ప్రక్షాళన మొదలుపెట్టారు. పార్టీలో మార్పులు చేర్పులు చేశారు.. పార్టీ అన్ని అనుబంధ విభాగాలకు అధ్యక్షుల్ని, జిల్లాల్లో అధ్యక్షుల్ని, నియోజకవర్గాల్లో ఇంఛార్జ్‌లను మార్చేశారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ట్విస్ట్ ఇస్తూ సత్తెనపల్లికి కొత్త ఇంఛార్జ్‌ను నియమించారు.


సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డిని నియమించారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి. పార్టీ నేతలు, కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతాననన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబును పక్కనపెట్టి సుధీర్ భార్గవరెడ్డికి బాధ్యతలు అప్పగించడం ఆసక్తికరంగా మారింది.

వైఎస్ జగన్ అంబటి రాంబాబును గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా నియమించారు. ఈ క్రమంలోనే సత్తెనపల్లి నియోజకవర్గంలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.. అంబటికి జిల్లా బాధ్యతల్ని అప్పగించి, సుధీర్ రెడ్డిని సత్తెనపల్లి తీసుకొచ్చినట్లు చర్చ జరుగుతోంది. అయితే సత్తెనపల్లి వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌గా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డిని నియమిస్తారని టాక్ వినిపించింది. కానీ ఉన్నట్టుండి సుధీర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది.. ఆయన్ను ఇంఛార్జ్‌గా నియమించారు.

భార్గవరెడ్డి కుటుంబానిది పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లు మండలం కాగా.. ప్రస్తుతం నరసరావుపేటలో ఉంటున్నారు. నరసరావుపేటలో గజ్జల సుధీర్ భార్గవరెడ్డి ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్. సుధీర్ రెడ్డి తండ్రి డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి వైఎస్సార్‌సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకునిగా పనిచేశారు. అంతేకాదు గజ్జల బ్రహ్మారెడ్డి గతంలో నరసరావుపేట టికెట్ ఆశించారు.. కానీ కుదరలేదు. అయితే నరసరావుపేట బాధ్యతలు అప్పగిస్తారని భావించారట.. కానీ సత్తెనపల్లికి సుధీర్ భార్గవరెడ్డిని పంపించారు. ఆయనకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు.. మరి కీలకమైన సత్తెనపల్లి నియోజకవర్గంలో యువ డాక్టర్ ఏ మేరకు ప్రభావం చూపిస్తారో చూడాలి.

వైఎస్ జగన్ కొద్దిరోజులుగా జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. పార్టీ ఇంఛార్జ్‌లు, ముఖ్య నేతల్ని పిలిపించి పార్టీ పరిస్థితి, బలోపేతంపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలో అవసరమైన మార్పులు చేస్తున్నారు.. త్వరలో మరికొన్ని మార్పులు, చేర్పులు ఉంటాయనే చర్చ కూడా నడుస్తోంది. కొన్ని నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను మార్పులు చేసే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది.