ఆంధ్రప్రదేశ్కు పండగ సీజన్లలో వచ్చే ప్రయాణికులకు ఛార్జీల బాదుడు తప్పడం లేదు. ముఖ్యంగా దసరా, సంక్రాంతి సమయాల్లో ఛార్జీలు పెంచడంతో సామాన్యులకు ఆర్థికంగా భారంగా మారుతోంది. ఈ క్రమంలో ఏపీ రవాశాఖమంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది పొడవునా పండగ సీజన్లతో పాటు రద్దీ సమయాల్లో.. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో ఒకే విధమైన ఛార్జీలు ఉండేలా చూస్తామన్నారు. ఛార్జీల విషయంలో త్వరలోనే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని తెలిపారు. ఇకపై ప్రయాణికులపై ఎలాంటి అదనపు భారం లేకుండా సంక్రాంతికి అదనపు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుపుతామన్నారు.
గతంలో పండగ ఆర్టీసీ బస్సు సర్వీసుల పేరుతో అదనపు భారం ఉండేదన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. రాష్ట్రంలో ఇప్పుడా పరిస్థితి లేకుండా చర్యలు తీసుకున్నామని.. పండగలవేళ అదనపు ఛార్జీల భారం ప్రజలపై లేకుండా చూస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంక్రాంతికి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అదనపు బస్సు సర్వీసులు ఏ్పాటు చేశామన్నారు. అలాగే రాయలసీమ జిల్లాల్లోని కొన్ని రాష్ట్ర రహదారుల్ని జాతీయ రహదారులగా మార్చే అంశంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో చర్చించామని.. ఆయన సానుకూలగా స్పందించారని తెలిపారు. అలాగే రాష్ట్రంలో రోడ్ల మరమ్మత్తుల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.కేంద్రం సహకారంతో ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తామన్నారు ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ. రాష్ట్రంలో కొత్తగా పది వేల ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని.. వాటిలో ఇప్పటికే వెయ్యి బస్సుల కొనుగోలుకు ఆర్డర్ చేసినట్లు తెలిపారు. కొనకళ్ల నారాయణ కృష్ణా జిల్లా అవనిగడ్డ డిపోనకు కొత్తగా కేటాయించిన రెండు సూపర్ లగ్జరీ, ఒక అద్దె బస్సును స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్తో కలిసి ప్రారంభించారు. ఈ రెండు సూపర్ లగ్జరీ బస్సుల్లో ఒకటి అవనిగడ్డ నుంచి రాయచూరుకు, మరో బస్సును భద్రాచలంకు నడుపుతున్నారు. సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని గమనించి మొత్తం 7,200 బస్సులు నడుపుతున్నట్లు కొనకళ్ల నారాయణ తెలిపారు. ఆ బస్సుల్లో కూడా సాధారణ ఛార్జీలు వసూలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
రాష్ట్రంలోని అన్ని డిపోల నుంచి రాజధాని అమరావతికి బస్సులు నడపాలని కోరారు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. ఈ నెల 20 నుంచి అమరావతికి అవనిగడ్డ నుంచి బస్సు నడుపుతామని కొనకళ్ల నారాయణ హామీ ఇచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవనిగడ్డ డిపోనకు 13 కొత్త బస్సులు సమకూరినట్లు ఆయన తెలిపారు. అవనిగడ్డ నుంచి హైదరాబాద్కు ఇంద్ర బస్సులు నడపాలని కోరగా.. ఆర్టీసీ ఛైర్మన్ సానుకూలంగా స్పందించారు.

0 Comments