ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు.. విశాఖ వేదికగా రాష్ట్రంలో రూ.2,08,548 కోట్ల విలువైన పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. పూడిమడక వద్ద ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమ, విశాఖపట్నం రైల్వే జోన్కు శంకుస్థాపన చేశారు. నక్కపల్లిలో రూ.1877 కోట్లు పెట్టుబడులతో బల్క్ డ్రగ్ పార్క్, రూ.4,593 కోట్లతో 10 ప్రాజెక్టులకు సంబంధించి రోడ్డు నిర్మాణం, విస్తరణ పనులు, రూ.2,139 కోట్లతో కృష్ణపట్నం పారిశ్రామిక పార్క్, రూ.6,028 కోట్లతో 6 రైల్వే ప్రాజెక్టులు, రూ.3,044 కోట్లతో 234.28 కి.మీ రోడ్లు, రూ.5,718 కోట్లతో 323 కి.మీ మూడు రైల్వే లైన్ పనులకు శంకుస్థాన చేశారు. అలాగే పల్నాడుజిల్లా చిలకలూరిపేట బైపాస్ను ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేశారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మీదుగా నుంచి నేషనల్ హైవే 16 వెళుతోంది.. అయితే ఆ సమీపంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో హైవేను ఆరు వరుసల విస్తరిస్తున్న సమయంలో చిలకలూరిపేట బైపాస్ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ బైపాస్ నిర్మాణంపై కొద్ది రోజులు సందిగ్థత కొనసాగింది. చివరికి 2019లో కేంద్రం చిలకలూరిపేట బైపాస్కు రూ.518.24కోట్లు మంజూరు చేసింది.. కానీ కరోనా కారణంగా పనులు ఆగిపోయాయి. ఈ బైపాస్ నిర్మాణ పనులకు సంబంధించి ఓ కంపెనీకి దక్కిన టెండర్లు రద్దు చేయగా.. మళ్లీ అదే కంపెనీకి టెండర్లు వచ్చాయి. చివరికి చిలకలూరిపేట బైపాస్ పనులు 2021 జులైలో తిరిగి ప్రారంభమయ్యాయి.
ఈ చిలకలూరిపేట బైపాస్ను ఆరు వరుసలతో పాటుగా.. బ్రిడ్జిలు, అండర్పాస్లు, సర్వీసు రోడ్లు, రెండు వైపులా ప్రహరీ,ఒక మెగా వాట్ సోలార్ పవర్, మొక్కల పెంపకం, బైపాస్ మొత్తం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒక్కమాటల చెప్పాలంటే అధునాతన వసతులతో ఈ బైపాస్ నిర్మాణాన్ని 2024 డిసెంబర్ నాటికి పూర్తి చేశారు అధికారులు. అయితే ఈ బైపాస్ పనుల్ని ప్రధాని మోదీ ప్రారంభించాల్సి ఉండగా.. వాయిదా పడింది. ఈ క్రమంలో అధికారులు వాహనాలను మాత్రం అనుమతించారు.. తాజాగా ప్రధాని మోదీ అధికారికంగా విశాఖపట్నం వేదికగా బైపాస్ను జాతికి అంకితం చేశారు. ఈ బైపాస్ నిర్మాణానికి సహకరించిన ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ధన్యవాదాలు తెలిపారు. ఈ బైపాస్ అందుబాటులోకి రావడంతో ప్రమాదాలకు అడ్డుకట్టపడుతుందన్నారు.. పట్టణంతో పాటుగా బొప్పూడి, గణపవరం, తిమ్మాపురం వరకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదన్నారు. అలాగే వాహనదారులు, స్థానికులు కూడా బైపాస్ అందుబాటులోకి రావడంతో హర్షం వ్యక్తం చేశారు. మొత్తానికి చిలకలూరిపేట జనాల బైపాస్ కల ఇన్నాళ్లకు నెరవేరిందని చెప్పాలి.

0 Comments