ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా రాష్ట్రంలో భ‌వ‌న నిర్మాణాలు, లేఅవుట్ల అనుమ‌తుల‌ నిబంధనలు సుల‌భ‌త‌రం చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు ఏపీ బిల్డింగ్ రూల్స్-2017, ఏపీ ల్యాండ్ డెవలప్‌మెంట్‌ రూల్స్ - 2017లో సవరణలు చేస్తూ ప్రభుత్వం వేర్వేరుగా జీవోలను జారీ చేసింది. ఈ జీవోతో పేదలకు కూడా మేలు జరగనుంది.. ప్రభుత్వం ఇచ్చే పట్టాలలో ఇళ్లు కట్టుకునేవారికి అనుమతులు సులభంగా వస్తాయంటున్నారు. ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వ కార్యాలయాల (కార్పొరేషన్, మున్సిపల్ ఆఫీస్‌లు) చుట్టూ తిరగకుండా అనుమతులు సులభతరం చేశారు.

అంతేకాదు ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో రియ‌ల్ ఎస్టేట్ రంగం పెరిగేలా చేసేందుకు సంస్కరణలు చేపట్టి.. ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో లే అవుట్లలో రోడ్లకు గతంలో 12 మీటర్లు ఉండగా.. ఇప్పుడు దానిని 9 మీటర్లకు తగ్గించారు. అలాగే 500 చదరపు మీటర్లు పైన స్థలాల్లో నిర్మాణాన్ని సెల్లారుకు అనుమతించారు. నేషనల్ హైవే, స్టేట్ హైవేలను ఆనుకుని ఉన్న స్థలాలు డెవ‌ల‌ప్ చేసేందుకు 12 మీటర్ల స‌ర్వీస్ రోడ్డు ఏర్పాటు నిబంధ‌నను కూడా తొలగించారు. బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాల సెట్ బ్యాక్ నిబంధ‌న‌ల్లో మార్పులు చేసింది ప్రభుత్వం. టీడీఆర్‌ బాండ్ల జారీ చేసే కమిటీ నుంచి రెవెన్యూ, సబ్‌ రిజిస్ట్రార్‌లను తొలగించారు.



ప్రజలకు, బిల్డర్లు, డెవలపర్లకు అనుకూలంగా ఉండేలా నిబంధనల్లో మార్పులు చేస్తూ వేర్వేరు జీవోలు జారీ చేసినట్లు మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ తెలిపారు. నిబంధనల్ని సులభతరం చేశామని.. అందరితో చర్చించి ఈ నిబంధనలు జారీ చేశామన్నారు. సంక్రాంతి కానుక‌గా ఈ జీవోలను తీసుకొచ్చామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు, బిల్డర్లు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు మంత్రి నారాయణ. కూటమి ప్రభుత్వం ఆ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అపార్ట్‌మెంట్లు, లే అవుట్‌లలో కొనుగోలుకు సంబంధించి వినియోగదారులు మోసపోకుండా రెరా అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు మంత్రి నారాయణ.