గుంటూరులో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. నగరంలో ఇన్నర్ రింగ్ రోడ్డులో గడ్డిపాడు దగ్గర ఉన్న రైల్వే మార్గంపై ఆర్వోబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జి)కు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఈ మేరకు ఆర్వోబీ కోసం రైల్వేశాఖ రూ. 107.79 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు డీపీఆర్, డిజైన్, భూ సేకరణ చేపట్టాలని కేంద్రం దక్షిణ మధ్య రైల్వే జీఎంకు లేఖ రాసింది.. దీంతో ఈ ఆర్వోబీకి లైన్ క్లియర్ అయ్యింది. ఆ ఆర్వోబీని నాలుగు లైన్లుగా గుంటూరు-నంబూరు రైల్వేస్టేషన్ల మధ్య ఎల్సీ నంబరు 3 గడ్డిపాడు దగ్గర నిర్మిస్తారు. ఈ ఆర్వోబీ పూర్తి చేస్తే పేరేచర్ల నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు మీదుగా విజయవాడ వెళ్లేవారికి సులభం అవుతుంది. గుంటూరు నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు మీదుగా నేషనల్ హైవే, విజయవాడకు వెళ్లేడానికి ఈ మార్గం అనుకూలంగా ఉంటుంది. నరసరావుపేట, పల్నాడు, హైదరాబాద్ వైపు నుంచి వచ్చే భారీ వాహనాలు కూడా గుంటూరులోకి రాకుండా పేరేచర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు మీదుగా విజయవాడకు వెళ్లొచ్చు.
కొంతకాలంగా ఈ రూట్లో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి.. ఇక్కడ రైల్వేమార్గం వద్ద గేటు పడితే రెండు వైపులా వాహనాలు బారులు తీరుతున్నాయి. వాహనదారులు చాలాసేపు అక్కడే ఉండాల్సి వస్తోంది. రైలు గేట్లు తీసిన తర్వాత కూడా ట్రాఫిక్ క్లియర్ కావడంతో 10 నిమిషాల వరకు పడుతోంది. గుంటూరులో వాహనాల రద్దీ పెరగడంతో.. విజయవాడవైపు వెళ్లే వాహనదారులకు రైల్వే గేటు దగ్గర పడిగాపులు తప్పడం లేదు. ఈ ట్రాఫిక్ కష్టాలను గమనించిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గత ఎన్నికల సమయంలో ఆర్వోబీకి సంబంధించి హామీ ఇచ్చారు. గుంటూరు ట్రాఫిక్ సమస్యలకు ఇబ్బందిగా ఉన్న శంకర్విలాస్ బ్రిడ్జి, గడ్డిపాడు రైల్వేమార్గంపై ఆర్వోబీ, నందివెలుగు రోడ్డులో ఆగిపోయిన బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీగా విజయం సాధించి కేంద్రమంత్రి అయ్యారు. ఈ మేరకు ఈ ఆర్వోబీ నిర్మాణానికి సంబంధించి నిధుల మంజూరుకు కృషి చేశారు. ఇప్పటికే గుంటూరులోని శంకర్విలాస్ బ్రిడ్జికి రూ. 98 కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ బ్రిడ్జికి సంబంధించి డిజైన్లు రూపొందిస్తుండగా.. ఇప్పుడు గడ్డిపాడు దగ్గర ఆర్వోబీ నిర్మాణానికి రూ. 107.79 కోట్లను రైల్వేశాఖ మంజూరు చేసింది. వీటితో పాటుగా నందివెలుగులో రైల్వేమార్గంపై బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల్ని కేంద్రం రప్పించే పనిలో ఉన్నారు. మొత్తానికి కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో ఆర్వోబీకి నిధులు మంజూరయ్యాయి.. డీపీఆర్, డిజైన్లు, భూ సేకరణ పూర్తి చేసి టెండర్లు పిలిచి నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు.

0 Comments